Venkaiah Naidu: జీవితంలో ఒక్కసారైనా అండమాన్ జైలును సందర్శించండి: వెంకయ్య నాయుడు

  • దేశ చరిత్రకు సమగ్రత చేకూరాలి
  • క్లైవ్ లాయిడ్ గొప్పవాడన్న భావన పోవాలి
  • చెన్నై రాజ్ భవన్ లో వెంకయ్యనాయుడు

భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ, తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా, అండమాన్ దీవుల్లో ఉన్న సెల్యులార్ జైలును సందర్శించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. చరిత్ర పుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సరైన ప్రాధాన్యం లభించలేదని అభిప్రాయపడ్డ ఆయన, చరిత్రకు సమగ్రత చేకూరాలంటే, స్వాతంత్ర్యం పట్ల వారికి ఉన్న భక్తి, తపనలను భావి తరాలు తెలుసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. చెన్నైలోని రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు, ఆపై ప్రసంగించారు.

"చరిత్రలో స్వాతంత్ర్య సమర యోధులకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యం ఇవ్వకపోవడం దురదృష్టకరం. చరిత్రను పరిశీలించి, వారి త్యాగాలను, ఘనతలను చాటిచెప్పాలి. మన దేశ సంప్రదాయాలను కలుషితం చేయడమే కాకుండా, భారతీయులను హింసించి, మన శ్రమను దోపిడీ చేసి, ఇక్కడి సంపదను దోచుకుని వెళ్లిన రాబర్ట్ క్లైవ్ ను గొప్పవాడని చదువుతున్నాం. ఈ పరిస్థితి మారాలి" అని అన్నారు.

ఆపై "జీవితంలో ఒక్కసారైనా, విద్యార్థులు, రాజకీయ నాయకులు అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలును సందర్శించాలి. అప్పుడే దేశంకోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, దేశం పట్ల వారి భక్తి, తపన అర్థమవుతాయి. వారందరికీ చరిత్రలో సముచిత స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత మనదే" అని అన్నారు.

More Telugu News