Botsa Satyanarayana Satyanarayana: మండలికి తాగొచ్చారన్న యనమల వ్యాఖ్యలపై బొత్స స్పందన

  • యనమల ఆరోపణలు సరికాదు
  • మండలిలో టీడీపీ ఇష్టానుసారం వ్యవహరిస్తోంది
  • ప్రజాబలంతో తాము ముందుకు వెళ్తాం

నిన్నటి శాసనమండలి సమావేశాలకు కొందరు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీలు తాగి వచ్చారంటూ టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మండలికి ఎవరు తాగొచ్చారని బొత్స మండిపడ్డారు. యనమల చేసిన ఆరోపణలు సరికాదని అన్నారు. అసెంబ్లీ లాబీలో ఈరోజు మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను మండలిలో అడ్డుకోవడం సరికాదని బొత్స అన్నారు. సంఖ్యాబలం ఉందని మండలిలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్టుగానే మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరించారని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. సూచనలు చేయాల్సిన మండలిలో... బిల్లులను అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. వికేంద్రీకరణ బిల్లు ఆమోదానికి కొంత ఆలస్యం జరగవచ్చని... అంతకంటే టీడీపీ చేసేదేమీ లేదని అన్నారు. ప్రజాబలంతో తాము ముందుకెళ్తామని చెప్పారు.

More Telugu News