Jagan: ఇంగ్లిషు మీడియం బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం.. మండలి బిల్లు అడ్డుకున్నా చట్టంగా మారుతుందన్న జగన్

  • ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల విద్యాబోధన అవసరం
  • ఇప్పుడు మళ్లీ మండలికి బిల్లు పంపుతాం 
  • అన్నీ తెలిసి కూడా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావట్లేదు 

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన బిల్లు (ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లు) కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకుముందు అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ సవరణలు కోరుతూ శాసన మండలిలో తిరస్కరించారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల విద్యాబోధన అవసరమన్నారు. ఇప్పుడు మళ్లీ మండలికి బిల్లు పంపుతామని, ఒకవేళ మండలి బిల్లు అడ్డుకున్నా చట్టంగా మారుతుందని, అన్నీ తెలిసి కూడా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావట్లేదని అన్నారు. శాసనమండలి చేసిన సవరణలను అసెంబ్లీ తిరస్కరించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదలకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అవసరమని చెప్పారు.
 
ప్రాథమిక దశ నుంచే ఇంగ్లిషు మీడియంలో చదువుకుంటే విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లేసరికి మెరుగైన ఫలితాలు వస్తాయని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రైవేటు పాఠశాలల్లో 95 శాతానికి పైగా ఇంగ్లిషు మీడియంలోనే బోధన జరుగుతోందని, కంప్యూటర్‌ భాష కూడా ఇంగ్గిషులోనే ఉంటుందని చెప్పారు. ప్రతి పేదవాడికి రైట్‌ టు ఇంగ్లిష్  ఎడ్యుకేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. కాగా, 36 లక్షల మంది విద్యార్థులకు ఈ ఏడాది జూన్‌లో విద్యా కానుక కిట్‌ అందిస్తామని జగన్‌ ప్రకటించారు.

More Telugu News