CAA: షాజీ... ప్రజల అసంతృప్తిని ప్రభుత్వాలు తేలికగా తీసుకోకూడదు: హోంమంత్రికి ప్రశాంత్ కిశోర్ చురక

  • సీఏఏపై ప్రజలు ఆందోళనలు కొనసాగించవచ్చన్న అమిత్ షా 
  • చట్ట సవరణను వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని ప్రకటన 
  • ట్విట్టర్ వేదికగా ఈ మాటలను తప్పుపట్టిన ఎన్నికల వ్యూహకర్త

పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని, కావాలంటే ప్రజలు తమ నిరసనలు కొనసాగించుకోవచ్చంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను జేడీయూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తప్పుపట్టారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

దీనిపై జరిగిన ఓటింగ్ లో జేడీయూ పాల్గొనడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. జేడీయూ ప్రధాన కార్యదర్శికి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. దీని తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్ఆర్ సీని తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదంటూ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ప్రకటనపై ట్విట్టర్ వేదికగా చురకంటించారు.

'షాజీ, ప్రజల అసంతృప్తిని ఏ ప్రభుత్వమూ తేలికగా తీసుకోకూడదు. అదే బలంగా భావించకూడదు. ప్రజల అసంతృప్తిని తోసి పుచ్చితే అది ప్రభుత్వం కొంపే ముంచుతుంది' అంటూ ఘాటుగా స్పందించారు. మీరు చాలా ధైర్యంగా ప్రకటించినట్టు నిజంగా ఎన్ఆర్ సీ, సీఏఏలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను పట్టించుకోకపోతే దాన్ని అమలు చేయడానికి ఎందుకు సాహసం చేయలేకపోతున్నారు? అంటూ ప్రశాంత్ కిశోర్ సవాల్ విసిరారు.

More Telugu News