Mallareddy: మంత్రి మల్లారెడ్డి టికెట్ లు అమ్ముకున్నారంటూ ఆరోపణలు... కేసీఆర్ తీవ్ర అసహనం... ఆడియో ఇదిగో!

  • మల్లారెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రాపోలు రాములు
  • తన వద్ద సాక్ష్యాలు, రికార్డులు ఉన్నాయని హెచ్చరిక
  • మల్లారెడ్డిని నిలదీసిన ఆడియో వైరల్

మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఇప్పించేందుకు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, డబ్బులు డిమాండ్ చేశారని చెబుతూ, సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఈ ఆడియోలో బోడుప్పల్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు రాపోలు రాములుతో మల్లారెడ్డి మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది.

 టికెట్ల కోసం మల్లారెడ్డి డబ్బులు అడిగిన సాక్ష్యాలు, రికార్డులు తన దగ్గర ఉన్నాయని రాపోలు రాములు చెబుతున్నారు. తనకు అన్యాయం చేశావని మల్లారెడ్డిని రాములు నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కేసీఆర్, కేటీఆర్ ముందుంచుతానని హెచ్చరించారు. తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వలేదని మండిపడ్డారు.

ఇక ఈ ఫోన్ కాల్ వ్యవహారం టీఆర్ఎస్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. విషయం తెలుసుకున్న కేసీఆర్, మల్లారెడ్డిపై తీవ్ర అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. కాగా, ఇటీవల మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డితో ఓ వేదికపై మల్లారెడ్డి గొడవపడిన సంగతి తెలిసిందే. తాజాగా మల్లారెడ్డి ఇలా ఆడియోతో బుక్ కావడంతో ఆయన రాజకీయ భవిష్యత్ ఏ మలుపు తిరుగుతుందోనన్న చర్చ మొదలైంది.

More Telugu News