cold waves: తెలుగు రాష్ట్రాలు గజ గజ : మూడు రోజుల నుంచి మరింత పెరిగిన చలి

  • ఉత్తరాది శీతల గాలుల ప్రభావం
  • మధ్య భారతం మీదుగా కోస్తా, రాయలసీమ, తెలంగాణపైకి
  • ఉదయానికి కప్పేస్తున్న మంచు దుప్పటి

మూడు రోజుల నుంచి హఠాత్తుగా పెరిగిన చలితో తెలుగు రాష్ట్రాల ప్రజలు గజ గజ వణుకుతున్నారు. పగలు ఎండకాస్తున్నా మధ్యాహ్నం వరకు చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇక రాత్రయితే తీవ్రంగా ఉంటోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాలతోపాటు ఉత్తర కోస్తా, రాయల సీమల్లో చలి ప్రభావం మరీ అధికంగా ఉంది. ఉత్తరాది నుంచి మధ్య భారతం మీదుగా వీస్తున్న చలిగాలుల ప్రభావం వల్లే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆకాశం కూడా నిర్మలంగా ఉండడంతో చలి ప్రభావం మరింత కనిపిస్తోంది.

చాలా చోట్ల గతంతో పోల్చుకుంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని గిన్నెదరిలో 5.7 డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నవ్యాంధ్రలోని ఆరోగ్యవరంలో 15.5 డిగ్రీలు, విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో 8 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పలుచోట్ల మంచు దుప్పటి ప్రభావం కూడా ఉంది.  సంక్రాంతి దాటే వరకు చలి ప్రభావం అధికంగానే ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

More Telugu News