Amaravati: మూడు రాజధానులతో టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు: ఎమ్మెల్యే రోజా

  • అమరావతి ప్రాంతంలో వాళ్ల భూముల ధరలు తగ్గిపోతాయని బాధ
  • రైతులకు అన్యాయం చేసింది చంద్రబాబే
  • సీఎం జగన్ గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు
మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ చూస్తుంటే టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రాజధాని అమరావతి ప్రాంతంలో వాళ్లకు ఉన్న భూముల ధరలు తగ్గిపోతాయన్న అక్కసు కన్పిస్తోందే తప్ప, రైతులకు అన్యాయం జరుగుతుందన్న బాధ వారిలో లేదని విమర్శించారు.

రైతులకు అన్యాయం చేసింది చంద్రబాబునాయుడే అని, రాజధాని ప్రాంతంలో చేస్తున్న ధర్నాలు, ర్యాలీలను రైతుల పేరిట టీడీపీ నాయకులు చేస్తున్నారని, ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలన్న దృష్టితో దశాబ్దాల కాలంగా వెనకబడిపోయిన రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని భావించిన సీఎం జగన్ గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అందుకే, అన్ని ప్రాంతాల వాళ్లు జగన్ ని ఆశీర్వదిస్తున్నారని, అది చూసి తట్టుకోలేకనే చంద్రబాబు అండ్ కో బురదజల్లాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
Amaravati
Capital
Chandrababu
YSRCP
Roja

More Telugu News