KCR: గడ్డం లేని ముల్లా కేసీఆర్.. ఒవైసీ గడ్డం కోసి ఆయనకు అతికిస్తా: బీజేపీ ఎంపీ అరవింద్

  • ఎంఐఎంకు కేసీఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారు
  • సొంత తమ్ముడిని కాపాడుకోలేని వ్యక్తి అసదుద్దీన్
  • నిజామాబాద్ కు వచ్చి అసద్ చేసేదేమీ లేదు

ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల ఓట్ల కోసమే పౌరసత్వ చట్టాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ గడ్డంలేని ఒక ముల్లా అని... అసదుద్దీన్ ఒవైసీ గడ్డం కోసి కేసీఆర్ కు అతికిస్తానని అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్, ఎంఐఎంలకు లేదని చెప్పారు. కేవలం ముస్లింలకు మాత్రమే కేసీఆర్ ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. హిందువులు ఓట్లు వేయకుండానే టీఆర్ఎస్ 90 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుందా? అని నిలదీశారు.

ఎంఐఎంకు తొత్తుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అరవింద్ దుయ్యబట్టారు. సొంత తమ్ముడు అక్బరుద్దీన్ ను సొంత ఇలాకాలో కత్తులతో పొడిచి, తుపాకీతో కాలిస్తే... కాపాడుకోలేని వ్యక్తి అసదుద్దీన్ అని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి బీజేపీని ఏదో చేస్తానని మాట్లాడుతున్నారని... ముందు హైదరాబాదులోని తన ప్రాంత అభివృద్ధిని అసద్ పట్టించుకోవాలని సూచించారు.

నిజామాబాద్ మేయర్ పదవిని ఎంఐఎంకు అప్పగించేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని మండిపడ్డారు. నిజామాబాద్ కు వచ్చి అసద్ చేసేదేమీ లేదని... నిజామాబాద్ బీజేపీ గడ్డ అని అన్నారు.

More Telugu News