Amaravati: మందడంలో రైతుల మహాధర్నా.. సొమ్మసిల్లి పడిపోయిన మహిళ!

  • పోలీసులు అరెస్టు చేసే సమయంలో ఉద్రిక్తత 
  • గొంతు నులమడంతో మహిళకు అస్వస్థత
  • మరో మహిళకు కంటిగాయాలు 

అమరావతి ప్రాంతంలో రైతులు తలపెట్టిన మహాధర్నాలో అపశ్రుతి చోటుచేసుకుంది. మందడంలో నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. పోలీసులు అరెస్టు చేసే సమయంలో ఆమె గొంతు నులమడంతో సదరు మహిళ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు బాధితురాలి తరఫు వ్యక్తులు ఆరోపిస్తున్నారు.

మరో మహిళ కళ్లజోడు పగిలిపోవడంతో ఆమె కంటి వద్ద గాయాలయ్యాయి. బాధిత మహిళ ను ‘108’ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు యత్నించారు. అయితే, పోలీసుల సాయాన్ని గ్రామస్తులు నిరాకరించారు. గ్రామస్తులు తమ సొంత వాహనంలోనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అరెస్టు చేసే సమయంలో తమ మెడల్లో ఉన్న బంగారు గొలుసులు పోయాయని, మంగళసూత్రాలను కూడా పోలీసులు లాగేశారని ఆరోపించారు.

More Telugu News