Crime News: అనైతిక వ్యవహారం... ఆత్మహత్యతో ముగింపు!

  • మహిళతో వివాహేతర సంబంధం 
  • ఆమె కుమార్తెతో వివాహ బంధం 
  • మహిళ మాయలోపడి దారి తప్పిన యువకుడు

ఓ మహిళ స్వార్థం, అనైతిక వ్యవహారంలో చిక్కుకుని నిండు జీవితాన్ని బలిచేసుకున్నాడో యువకుడు. ప్రియుడిని వదులుకోలేని ఆ మహిళ అతడిని తన కూతురికే ఇచ్చి పెళ్లి చేసింది. కానీ తల్లీ, భర్త మధ్య ఉన్న అనైతిక వ్యవహారంపై దంపతుల మధ్య కలతలు ఒకరి బలవన్మరణానికి కారణమయ్యాయి.

పోలీసుల కథనం మేరకు... అరిపిరాల రవిశంకరశర్మ (35)ది ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కొత్త ముడివేముల గ్రామం. ఇతను గుంటూరులో చదువుకునేటప్పుడు అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన శర్మ తల్లిదండ్రులు వేరే సంబంధం చూసి అతనికి పెళ్లి చేశారు.

వివాహం అయినా సదరు మహిళతో శర్మ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఇది దంపతుల మధ్య వివాదానికి కారణమవుతుండడంతో, తమ అనైతిక వ్యవహారానికి శర్మ భార్య అడ్డుగా ఉందని భావించిన సదరు మహిళ ప్రియుడిని ఒప్పించి ఆమెకు విడాకులు ఇప్పించింది.

అనంతరం తన కుమార్తెనే ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తే తమ వ్యవహారానికి ఏ అడ్డూ ఉండదని భావించింది. తన పెద్దకుమార్తెను శర్మకిచ్చి పెళ్లి చేసింది. పౌరోహిత్యంతో జీవనోపాధి పొందుతున్న శర్మ వివాహ బంధం కొన్నాళ్లు సజావుగా సాగింది. మరోపక్క, తల్లితో కూడా అతని వ్యవహారం కొనసాగింది.

కొన్నాళ్లకు తల్లీ, భర్తల తీరుపై అనుమానం రావడంతో శర్మ ప్రస్తుత భార్య భర్తను నిలదీయడం మొదలు పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అటు ప్రియురాలు, ఇటు భార్య మధ్య నలిగి పోయిన శర్మ ఇక చనిపోవడమే ఉత్తమమని భావించాడు.

శనివారం రాత్రి కురిచేడు రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. అక్కడ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసరావు పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News