MS Dhoni: ధోనీ కెప్టెన్సీలో బెడిసికొట్టిన నిర్ణయం అదొక్కటే: ఇషాంత్ శర్మ

  • కెప్టెన్సీలో ధోనీ, కోహ్లీ మధ్య తేడా వివరించిన ఇషాంత్
  • ధోనీ రొటేషన్ పద్ధతి అమలు చేశాడన్న ఇషాంత్
  • కోహ్లీ వరుసగా అవకాశాలిచ్చాడని వెల్లడి

ప్రపంచంలోనే అత్యంత పదునైన పేస్ దళం ఏదంటే ఎవర్నడిగినా టీమిండియా అనే చెబుతారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ లతో కూడిన భారత ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ప్రపంచంలోని ఏ అగ్రశ్రేణి బ్యాటింగ్ లైనప్ కైనా ముచ్చెమటలు పోయిస్తుంది. పిచ్ లతో సంబంధం లేకుండా చెలరేగుతున్న టీమిండియా పేసర్లను చూస్తే పెద్ద జట్లు సైతం హడలిపోయే పరిస్థితులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మార్పు ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ బాధ్యతలు స్వీకరించగానే, నమ్మదగిన ఫాస్ట్ బౌలర్లకు క్రమం తప్పకుండా అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు ఇషాంత్ శర్మ కూడా అదే విషయం చెబుతున్నాడు.

ఎంఎస్ ధోనీ భారత క్రికెట్ కు మరపురాని విజయాలు అందించి ఉండొచ్చు గాక, కానీ అతని సారథ్యంలో ఒకే ఒక్క విషయంలో భారత్ వెనుకబడిపోయిందని ఇషాంత్ అన్నాడు. ధోనీ హయాంలో పేసర్లు ఇంత నిలకడగా ఎప్పుడూ రాణించలేదని, అందుకు కారణం కూడా ధోనీ తీసుకున్న నిర్ణయమేనని తెలిపాడు. ఫాస్ట్ బౌలర్లకు రొటేషన్ పద్ధతిలో అవకాశాలు ఇవ్వాలని ధోనీ నిర్ణయించుకోవడంతో, ఏ బౌలర్ కూ తగినంత అనుభవం లభించలేదని వెల్లడించాడు. బౌలర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో తమ మధ్య అవగాహన ఏర్పడలేదని వివరించాడు.

కానీ కోహ్లీ కెప్టెన్సీలో ఆ పరిస్థితి మారిందని, పేసర్లకు నిలకడగా అవకాశాలు ఇవ్వడంతో వారు రాటుదేలేందుకు తగిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఇషాంత్ చెప్పాడు. ఎక్కువ మ్యాచ్ ల్లో కలిసి ఆడుతుండడం వల్ల ఫాస్ట్ బౌలర్ల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయని తెలిపాడు.

More Telugu News