amaravathi: అమరావతిలో ఏడో రోజుకు చేరిన నిరసనలు.. అడ్డుకుంటున్న పోలీసులు

  • ఏపీలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు
  • తుళ్లూరులో రైతులు టెంట్లు వేసే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు
  • రైతుల ఆందోళనకు ప్రజా సంఘాలు, విద్యార్థుల మద్దతు

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఏడో రోజుకు చేరాయి. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రజా సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు.  తుళ్లూరులో టెంట్లు వేసేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

నేడు మందడం రహదారిపై ఆందోళన చేపట్టేందుకు ఆ ప్రాంత రైతులు సిద్ధమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు వారిని రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు ‘చలో హైకోర్టు’కు పిలుపునిచ్చారు. ‘సేవ్ అమరావతి’ పేరిట సిద్ధార్థ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు.

మరోవైపు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలసి మొరపెట్టుకోవాలని రాజధాని రైతులు ఆయన అపాయింట్‌మెంట్ కోరారు. మరోవైపు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో రైతులు భేటీ కానున్నారు. రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మోహరించారు.

More Telugu News