ఖమ్మంలో మంత్రి పువ్వాడ ఆకస్మిక పర్యటన.. తెల్లవారుజామునే సైకిలెక్కిన మంత్రి!
- మంత్రి రాకతో పరుగులు తీసిన కలెక్టర్, మేయర్, అధికారులు
- రోడ్డుపై చెత్త కనబడడంతో ఆగ్రహం
- సమస్యల పరిష్కారానికి సూచనలు
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ ఉదయం ఖమ్మంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. సైకిలుపై పట్టణంలో తిరుగుతూ శానిటేషన్ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. రోడ్డు పక్కన చెత్త కనబడిన ప్రతిచోటా ఆగి కారణాలను ఆరా తీశారు. తొలగించకుండా రోడ్డుపై అలా ఎందుకు వదిలేశారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అలాగే, అభివృద్ధి పనులపైనా ఆరా తీశారు. తెల్లవారుజామునే మంత్రి సైకిలుపై రోడ్డుపైకి రావడంతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మునిసిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి తదితరులు ఆయన వెంట పరుగులు తీశారు.