Andhra Pradesh: ఏపీకి మూడు రాజధానుల అంశంపై చిరంజీవి వ్యాఖ్యలు

  • వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనన్న చిరంజీవి
  • జగన్ రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారంటూ ప్రశంసలు
  • రాజధానుల అంశంపై ప్రజల్లో అపోహలు తొలగించాలని సూచన

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు, జీఎన్ రావు కమిటీ నివేదికలోని అంశాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఏపీ రాజధాని అంశంలో తన అభిప్రాయాలు వెల్లడించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మూడు రాజధానుల అంశాన్ని అందరూ స్వాగతించాలని చిరు పేర్కొన్నారు.

గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందని, ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని వివరించారు. ఇప్పుడు అమరావతినే అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని అందరిలోనూ ఆందోళన ఉందని అన్నారు. అయితే, మూడు రాజధానుల అంశంపై నెలకొన్న అపోహలను, అపార్థాలను ప్రభుత్వం తొలగించాలని సూచించారు.

More Telugu News