Chandrababu: అమరావతిలో రాజధాని వస్తుందని అందరికీ ఒకే రోజు కల వచ్చిందా?: విజయసాయి రెడ్డి

  • రాజధాని ప్రకటనకు ముందే  చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగుకు పాల్పడ్డారు
  • అది ఆయన పేటెంట్
  • పచ్చపార్టీ నేతలు వైసీపీపై నిందలు వేస్తున్నారు 
  • చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు

రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన ప్రకటనపై వస్తున్న విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే జగన్ తాపత్రయపడుతున్నారని చెప్పారు.

అమరావతిలో రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టు, ఇంకా ఏదయినా ప్రకటనకు ముందే తన వాళ్లకు సమాచారం ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇన్ సైడర్ ట్రేడింగుకు పాల్పడ్డారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. 'అది ఆయన పేటెంట్. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని రావడం ఇష్టం లేని దత్తపుత్రుడు, పచ్చపార్టీ నేతలు వైసీపీపై నిందలు వేస్తున్నారు' అని ట్వీట్ చేశారు.

'రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న వారంతా అమరావతిని అధికారికంగా ప్రకటించకముందే చంద్రబాబు నాయుడి బంధువులు, బినామీలు, పచ్చ మాఫియా వేల ఎకరాలు ఎలా కొన్నారో అర్థం చేసుకోవాలి. రాజధాని వస్తుందని అందరికీ ఒకే రోజు కల వచ్చిందా? మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేది జగన్ మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
 
కడప స్టీల్ ప్లాంటు విషయంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరుగా నిల్చారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఇనుప ఖనిజం సరఫరా హామీ లేకుండానే ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేశారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఎన్ఎండీసీ తో ఏటా 50 లక్షల టన్నుల ఖనిజం సరఫరాకు ఎంఓయూ కుదుర్చుకుందని చెప్పారు. జగన్ గారికి, మోసకారి బాబుకు తేడా ఇదే అంటూ ఆయన ట్వీట్లు చేశారు.

More Telugu News