Odisha: నిబంధనల్ని ఉల్లంఘించి నిషిద్ధ ప్రాంతంలో మంత్రిగారి పుత్రిక ఫొటో సెషన్!

  • ఒడిశా మంత్రి కుమార్తెపై మీడియా ఫోకస్
  • హీరాకుడ్ డ్యామ్ వద్ద మిత్రురాళ్లతో సందడి
  • ప్రవేశంలేని ప్రాంతాల్లోకి ఎంటరైన మంత్రి కుమార్తె

ఒడిశా మంత్రి నబకిశోర్ దాస్ కుమార్తె దీపాలి దాస్ ఇప్పుడు వార్తల్లోకెక్కారు. ఆమెపై మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏదో గొప్ప విషయం గురించి కాదు, నిబంధనల్ని పక్కనబెట్టి ఓ నిషిద్ధ ప్రదేశంలో యథేచ్ఛగా ఫొటోలు దిగారు.

తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని దీపాలి దాస్ కొందరు ఒడిశా సినీ హీరోయిన్లు ప్రకృతి మిశ్రా, ఎలీనా సమంత్రేలను వెంటేసుకుని సంబల్ పూర్ లోని హీరాకుడ్ డ్యామ్ ను సందర్శించారు. అక్కడి నిషిద్ధ ప్రదేశాల్లో ఆమె తన మిత్రురాళ్లతో కలసి ఫొటో సెషన్ నిర్వహించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రిగారిపై విమర్శల జడివాన కురిసింది. మంత్రి కుమార్తెకు నిబంధనలు వర్తించవా? పోలీసులు ఏం చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

దీనిపై మంత్రి నబకిశోర్ స్పందిస్తూ, తన కుమార్తె విషయంలో తాను జోక్యం చేసుకోబోనని, చట్టం తనపని తాను చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ దర్యాప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

More Telugu News