Telugudesam: టీడీపీ నేతను వేట కొడవళ్లతో నరికి, తలపై బండరాయితో మోది హతమార్చిన ప్రత్యర్థులు

  • బెలూం గుహల సమీపంలో సుబ్బారావు దారుణహత్య
  • హతుడి స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి
  • ఫ్యాక్షన్ హత్యతో ఉలిక్కిపడ్డ కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మరోసారి పడగవిప్పింది. టీడీపీ నేత సుబ్బారావును (45) ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం బెలూం గుహల సమీపంలో చోటుచేసుకుంది. హత్యకు గురైన సుబ్బారావు బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా తెలుస్తోంది. ఈయన స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సుబ్బారావు గ్రానైట్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. బెలూం గుహల సమీపంలో పనులు జరుగుతున్న నేపథ్యంలో, ఈ మధ్యాహ్నం ఆయన అక్కడకు వెళ్లారు. ఆయన రాకపై పక్కా సమాచారం అందుకున్న ప్రత్యర్థులు... కాపుకాసి, దారుణంగా హత్య చేశారు. రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు ఒక్కసారిగా ఆయనపై వేట కొడవళ్లతో తెగబడ్డారు. ఆయనను దారుణంగా నరికి చంపిన తర్వాత... బండరాయితో తలపై కొట్టి పరారయ్యారు.

గత కొన్ని రోజులుగా సుబ్బారావుకు, ఆయన ప్రత్యర్థులకు గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు, ఈ హత్యతో కర్నూలు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... కేసును నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.

More Telugu News