వివాహిత పట్ల అసభ్య ప్రవర్తన.. గ్రామస్థులు చితకబాదడంతో నిందితుడికి తీవ్రగాయాలు
- రాత్రి వేళ మహిళ ఇంటికి
- కేకలు వేయడంతో పారిపోయిన వైనం
- విషయం తెలిసి దాడిచేసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు
పెళ్లయి అత్తవారింట కాపురం చేసుకుంటున్న మహిళ ఇంటికి వెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పట్టుకుని బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చితకబాదారు. దీంతో అతను తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యాడు. బాధితుల కథనం మేరకు...చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఆనపగుట్టకు చెందిన ఎస్.మహ్మద్ వల్లి (28) చేనేత కార్మికుడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అదే గ్రామానికి చెందిన మహిళకు పెళ్లయి తనకల్లులో ఉంటోంది. శనివారం రాత్రి తనకల్లు గ్రామానికి వెళ్లిన మహ్మద్ వల్లి పాతపరిచయంతో సదరు మహిళ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భయంతో ఆమె కేకలు వేయడంతో పారిపోయిన మహ్మద్ వల్లి మదనపల్లికి వచ్చేశాడు.
కాగా, నిన్న తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనపగుట్టకు వచ్చారు. మహ్మద్ వల్లిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనలో మహ్మద్ తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
అయితే 'పాత పరిచయం నేపథ్యంలో నన్ను సదరు మహిళే ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. అందుకే వెళ్లాను. వెళ్లాక ప్లేట్ ఫిరాయించింది' అంటూ మహ్మద్ వల్లీ పోలీసులకు తెలిపాడు.