praveen kumar: నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం: క్రికెటర్ ప్రవీణ్ కుమార్

  • పొరుగింటి వ్యక్తిపై దాడిచేసినట్టు ఆరోపణలు
  • తాను చీమకు కూడా హాని చేయనన్న ప్రవీణ్ కుమార్
  • వారే తనను కారు నుంచి బయటకు లాగారన్న క్రికెటర్

తన పొరుగింటి వ్యక్తి, అతడి కుమారుడిపై తాను దాడిచేసినట్టు వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ స్పందించాడు. చీమకు కూడా హానిచేయని తాను దాడిచేశాననడం అబద్ధమన్నారు. ఉత్తరప్రదేశ్‌, మీరట్‌లోని టీపీ నగర్‌లో నివసిస్తున్న ప్రవీణ్ తన పొరుగింటి వ్యక్తి దీపక్ మిశ్రా, అతడి కుమారుడిపై దాడిచేసినట్టు పోలీసు కేసు నమోదైంది.

దీపక్ తన ఏడేళ్ల కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు బస్టాండ్‌లో వేచి చూస్తుండగా, అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రవీణ్ బస్సు వల్ల ట్రాఫిక్ జామ్ అయిందంటూ డ్రైవర్‌తో గొడవపడ్డాడు. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన దీపక్ మిశ్రా, అతడి కుమారుడిని తోసేశాడు. దీంతో దీపక్ చేతికి గాయమైంది. ఈ ఘటనపై ప్రవీణ్ కుమార్, దీపక్ మిశ్రా ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తానెప్పుడూ చీమకు కూడా హానిచేయలేదని అన్నాడు. అలాంటిది ఓ పిల్లాడిపై ఎలా దాడిచేస్తానని ప్రశ్నించాడు. తానో అంతర్జాతీయ క్రికెటర్‌నని పేర్కొన్న ప్రవీణ్, తనకూ ఓ బాబు, పాప ఉన్నారన్నాడు. తాను కారు దిగుతున్నప్పుడు వారే తనను కిందికి లాగిపడేశారని ఆరోపించాడు. కాగా, ప్రవీణ్ కుమార్ గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

More Telugu News