Disha: దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు.. ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారణ

  • దిశ హత్యాచారం కేసులో పోలీసులకు దొరికిన మరో ఆధారం
  • దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు
  • వాంగ్మూలంలో ఇదే విషయాన్ని చెప్పిన నిందితులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో పోలీసులకు మరో ఆధారం లభ్యమైంది. బాధితురాలి మృతదేహంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. ఆమె కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అంటే అత్యాచారానికి ముందు నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారన్న విషయం దీనిని బట్టి అర్థమవుతోంది.

నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ.. అత్యాచారం సమయంలో నిందితులు ఆమె నోట్లో బలవంతంగా మద్యం పోసినట్టు తెలిపారు. వాంగ్మూలంలోనూ నిందితులు ఇదే విషయం చెప్పినట్టు పోలీసులు రిమాండ్ డైరీలో సైతం పేర్కొన్నారు. ఇప్పుడా విషయాన్ని ఫోరెన్సిక్ నివేదిక ధ్రువీకరించింది.

More Telugu News