Ys viveka: వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్.. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసిన బీటెక్ రవి!

  • బాబాయి కేసును జగన్ పట్టించుకోవడం లేదు
  • ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదు
  • అందుకే, సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టుకు వెళ్లా

వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ బాబాయి హత్యకు గురై ఏడాది గడుస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఈ కేసు విచారణ విషయంలో ఏపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, అందుకే, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ వేసినట్టు చెప్పారు. అమాయకులకు శిక్ష పడకూడదని, ఈ పిటిషన్ తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఇది తన వ్యక్తిగతమని స్పష్టం చేశారు.

ఈ హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేని తమను విచారిస్తున్నారని, ఈ హత్య వెనుక తన ప్రమేయం ఉంటే కనుక ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమేనని అన్నారు. వివేకా అజాతశత్రువని, ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. సీబీఐతో విచారణ జరిపించాలని కోరిన వివేకా కూతురు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

More Telugu News