Team India: చెలరేగిన టీమిండియా ఓపెనర్లు... ఆపై వెంటవెంటనే వికెట్లు!

  • ముంబయిలో మ్యాచ్
  • రోహిత్, రాహుల్ ఫిఫ్టీలు
  • నిరాశపర్చిన పంత్

సిరీస్ ఫలితం తేల్చే చివరి టి20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు చెలరేగిపోయారు. వెస్టిండీస్ తో ముంబయిలోని వాంఖెడేలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా విజృంభించారు. రోహిత్ శర్మ సొంతగడ్డపై జోరు ప్రదర్శిస్తూ 34 బంతుల్లోనే 6 ఫోర్లు 5 సిక్స్ ల సాయంతో 71 పరుగులు చేశాడు. భారీ షాట్ కొట్టే యత్నంలో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 11.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 138 పరుగులు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 43 బంతుల్లో 68 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. రాహుల్ 8 ఫోర్లు 2 సిక్స్ లు బాదాడు.

అయితే, ఎన్నో అంచనాల నడుమ బరిలో దిగిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ సున్నా పరుగులకే వెనుదిరిగాడు. పొలార్డ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి లాంగాఫ్ లో హోల్డర్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ కు తోడుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 14 ఓవర్లలో 2 వికెట్లకు 151 పరుగులు.

More Telugu News