Nityananda: నేను పరమ శివుడిని...నన్ను టచ్‌ చేసే మొనగాడు లేడు : ఆధ్యాత్మిక గురువు నిత్యానంద

  • శిష్యగణాన్ని ఉద్దేశించి మాట్లాడిన వీడియో లీక్‌
  • పలు కేసులకు సంబంధించి మోస్ట్‌ వాంటెడ్‌
  • పోలీసుల కళ్లుగప్పి విదేశాలకు పరారు

ఈక్వెడార్‌లో ఓ దీవిని కొనుక్కుని ప్రత్యేక సామ్రాజ్యాన్ని నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నాడని భావిస్తున్న ఆధ్యాత్మిక గురువు నిత్యానంద తాజాగా ఓ సంచలన వీడియో విడుదల చేశారు. ఆధ్యాత్మిక గురువు ముసుగులో అత్యాచారాలతోపాటు పలు అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటూ భారత్‌ పోలీసుల వేట ఎదుర్కొంటున్న ఈ నిత్యానంద కొన్నాళ్ల క్రితం నేపాల్‌ మీదుగా విదేశాలకు పారిపోయాడు. చాలాకాలం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా వ్యవహారాలు నెట్టుకు వచ్చాడు. తీరా ఈక్వెడార్‌లో ఉన్నాడని తెలియడంతో దేశంలో ఇదో సంచలన వార్త అయ్యింది.

అయితే అక్కడ ఉన్నదీ, లేనిదీ కచ్చితంగా తెలియకున్నా తన శిష్యగణాన్ని ఉద్దేశించి విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ వీడియోలో నిత్యానంద కాస్త టెంపర్‌గానే మాట్లాడాడు. ‘నేను పరమ శివుడిని. నన్ను ఎవరూ టచ్‌ చేయలేరు. ఏ స్టుపిడ్‌ కోర్టు కూడా నన్ను ప్రాసిక్యూట్‌ చేయలేదు. నేను నిజం చెప్పగలను. మీ ముందు నా నిజాయతీని నిరూపించుకోగలను’ అంటూ శిష్యగణాన్ని ఉద్దేశించి మాట్లాడాడు.

ఇది ఎప్పుడు, ఎక్కడి నుంచి మాట్లాడాడన్నది తెలియక పోయినా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా, తాము నిత్యానందకు ఏ దీవినీ అమ్మలేదని, తాను కొత్త దేశాన్నే సృష్టించానని చెప్పుకునే నిత్యానందకు అంత సీన్‌ కూడా లేదని ఈక్వెడార్‌ స్పష్టం చేయడం గమనార్హం.

తాను ఆశ్రయం పొందేందుకు నిత్యానంద పెట్టుకున్న శరణార్థి దరఖాస్తును కూడా తాము తిరస్కరించినట్లు ఈక్వెడార్‌ స్పష్టం చేసింది. రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానంద విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారని కర్ణాటక, కేంద్ర ప్రభుత్వాలను పలువురు నిలదీస్తున్నారు.

More Telugu News