sadhya: నేరస్థులు పేదలు, దళితులు అయితేనే శిక్షలు వేస్తున్నారు: సంధ్య తీవ్ర ఆరోపణలు

  • ఉన్నావో నిందితుడిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయలేదు
  • ఆ బీజేపీ నేతను ఎన్ కౌంటర్ చేయాలని నేను కోరుతున్నాను
  • మహిళలను రక్షించే విధానం ఇది కాదు

'దిశ' కేసు ఎన్ కౌంటర్ పై, ఉన్నావోలో తాజాగా జరిగిన అత్యాచార బాధితురాలి హత్య ఘటనపై సామాజిక ఉద్యమకారిణి సంధ్య స్పందించారు. 'ఈ ఘటనలపై ఓ సామాజిక ఉద్యమకారిణిగా నేను కూడా బాధపడుతున్నాను. నేరస్థులు పేదలు, దళితులు అయితేనే వారికి ఇటువంటి శిక్షలు విధిస్తున్నారు. అంతేగానీ, అత్యాచారాలపై దేశంలో సున్నితత్వంతో స్పందించే గుణం లేదు' అని అన్నారు. దిశ ఘటన అత్యంత క్రూరమైనదేనని, నిందితులకు తగిన కఠిన శిక్ష వేయాలని తానూ డిమాండ్ చేశానని అన్నారు. అయితే, ఆ నలుగురినే దోషులుగా భావించి, ఎన్ కౌంటర్ చేయడం సరికాదని అన్నారు. ఇలాగైతే పోలీసులను ఎలా నమ్మాలని ప్రశ్నించారు.  

'2017లో జరిగిన ఉన్నావో అత్యాచారం ఘటన నిందితుడు, బీజేపీ బహిష్కృత నేత కుల్‌దీప్‌ సెంగార్ ను కూడా ఇదే విధంగా ఎన్ కౌంటర్ చేయాలని నేను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను కోరుతున్నాను. అత్యాచార ఘటనల్లో ప్రజల్లో ఉన్న ఆవేశాన్ని పక్క దారి పట్టించేందుకే ఇటువంటి ఎన్ కౌంటర్ లు చేస్తున్నారు. దేశంలోని చాలా అత్యాచార ఘటనల్లో పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదు. మహిళలను రక్షించే విధానం ఇది కాదు' అని సంధ్య అన్నారు.

More Telugu News