Hyderabad: ప్రియుడితో కలిసి భర్తను సజీవ దహనం చేసిన ఇల్లాలు.. ప్రమాదంగా చిత్రీకరించే యత్నం!

  • హైదరాబాద్ శివారు వనస్థలిపురంలో ఘటన
  • ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్
  • గుడిసెకు నిప్పు పెట్టి ప్రమాదంగా నమ్మించే యత్నం

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను సజీవ దహనం చేసింది. అనంతరం ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయారు. హైదరాబాద్ శివారు వనస్థలిపురంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా దొండ తిరుమలగిరి మండలంలోని కుమ్మరిగడ్డ తండాకు చెందిన రమేశ్ (29) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బీఎన్‌రెడ్డినగర్‌లో గుడిసె వేసుకుని జీవిస్తున్నాడు. రమేశ్ మేస్త్రీ కాగా, భార్య కూలిపనులు చేసేది. గత నెల 26 రమేశ్ తన గుడిసెలో సజీవ దహనమై కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్నిప్రమాదమే కారణంగా తేల్చారు.

అయితే, రమేశ్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు అనుమానాలు లేవనెత్తడంతో హత్య విషయం వెలుగుచూసింది. రమేశ్ భార్యకు నల్గొండకు చెందిన మరో మేస్త్రీతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య, పిల్లలతో కలిసి అతడు కూడా అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని తొలగించుకోవాలని ఇద్దరూ నిర్ణయించారు. తాను లేని సమయంలో అతడిని చంపేయాలని ప్రియుడికి చెప్పింది.

ప్లాన్ ప్రకారం.. హత్యకు రెండు రోజుల ముందు పిల్లలను తీసుకుని నిందితురాలు అత్తారింటికి వెళ్లింది. అనుకున్న ప్రకారం ఆమె వెళ్లగానే గత నెల 26న పెట్రోలు బాటిల్‌తో రమేశ్ గుడిసె వద్దకు చేరుకున్న నిందితుడు గుడిసెపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. మద్యం తాగి మత్తులో నిద్రపోతున్న రమేశ్ మంటల్లో సజీవ దహనమయ్యాడు. రమేశ్ కుటుంబ సభ్యుల అనుమానంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

More Telugu News