పశ్చిమబెంగాల్ గవర్నర్ కు చేదు అనుభవం.. అసెంబ్లీకి రాకుండా గేటుకు తాళం
- గవర్నర్, మమతా బెనర్జీల మధ్య ముదిరిన వివాదం
- గేట్ కు తాళం వేయడంతో షాక్ కు గురైన గవర్నర్
- గేట్ నంబర్ 2 నుంచి లోపలకు వెళ్లిన వైనం
పశ్చిమబెంగాల్ లో గవర్నర్ జగదీప్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య వివాదం తార స్థాయికి చేరింది. ఈరోజు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీకి వచ్చిన ఆయన కాన్వాయ్ గేట్ నంబర్ వన్ గుండా లోపలకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆ గేటుకు తాళం వేయడంతో ఆయన షాక్ కు గురయ్యారు. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం గేట్ నంబర్ 2 నుంచి నడుచుకుంటూ లోపలకు వెళ్లారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారంటూ మమతా బెనర్జీ ఇటీవలి కాలంలో గవర్నర్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఘటనతో వీరి మధ్య అగాధం మరింత పెరిగినట్టయింది.