Pakistan: ప్రేమ మైకంలో పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన భారతీయ యువతి!

  • పాకిస్థాన్ యువకుడిని ప్రేమించిన హర్యానా యువతి
  • నకిలీ ఐడీతో పాక్ లోకి ప్రవేశించిన ప్రియురాలు
  • మందలించి వెనక్కి పంపిన పాక్ రేంజర్లు

ప్రేమ మైకం ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కొనేలా చేస్తుందనేందుకు ఇది మరొక ఉదాహరణ. తన ప్రియుడిని కలుసుకునేందుకు ఓ భారతీయ యువతి ఏకంగా పాక్ గడ్డపై అడుగుపెట్టింది. వివరాల్లోకి వెళ్తే, హర్యానాలోని కైదల్ జిల్లాకు చెందిన ఓ యువతి పాకిస్థాన్ కు చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. పాకిస్థాన్ కు వెళ్లి తన ప్రియుడిని కలుసుకోవాలనుకుంది. ఇటీవలే ప్రారంభమైన కర్తార్ పూర్ కారిడార్ ను తన మార్గంగా ఎంచుకుంది. ఒక నకిలీ ఐడీని తయారు చేసుకుని, పాక్ లోకి ప్రవేశించింది. ఆమె ఐడీని పరిశీలించిన పాక్ రేంజర్లు... అది నకిలీ ఐడీ అని గుర్తించారు.

ఆమెను తమ కార్యాలయంలోకి తీసుకెళ్లి విచారించిన పాక్ రేంజర్లు షాక్ కు గురయ్యారు. తన ప్రియుడిని కలుసుకోవడానికే పాకిస్థాన్ లో అడుగుపెట్టానని ఆమె చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. ఆమె చెబుతున్న మాటల్లో నిజం ఉందని గ్రహించిన పాక్ రేంజర్లు... ఆమెను మందలించి తిరిగి భారత్ కు పంపించేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ కోసం ఆమె చేసిన ప్రయత్నాన్ని పలువురు నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు. ప్రేమ మైకంలో ఇలాంటి పనులు చేయడం ప్రాణాల మీదకు తెస్తుందని మరి కొందరు హెచ్చరిస్తున్నారు.

More Telugu News