Tihar: తీహార్ నుంచి బయటకు వచ్చి... నేరుగా సోనియా ఇంటికి వెళ్లిన చిదంబరం!

  • నిన్న రాత్రి 8 గంటల సమయంలో విడుదల
  • ఆ వెంటనే సోనియా నివాసానికి
  • పార్టీ అండగా ఉంటుందని సోనియా హామీ

దాదాపు 106 రోజుల జైలు జీవితం అనంతరం బయటకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం, గత రాత్రి సోనియా గాంధీని కలిశారు. తీహార్ జైలు నుంచి నిన్న రాత్రి 8 గంటల సమయంలో విడుదలైన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలుకగా, వాహనంలో సోనియా ఇంటికి చిదంబరం చేరుకున్నారు. ఈడీ కేసులో నిన్న సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

ఇక సోనియాను కలిసి, ఆమెతో దాదాపు 45 నిమిషాలకు పైగా భేటీ అయిన చిదంబరం, దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, తనపై ఉన్న కేసుల గురించి చర్చించినట్టు సమాచారం. చిదంబరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సోనియా, పార్టీ ఆయనకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, గత వారంలో ప్రియాంకతో కలిసి తీహార్ జైలుకు వెళ్లిన సోనియా, కాసేపు చిదంబరంతో మాట్లాడి వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News