Jagan: ఉల్లి ధరలు జగన్ గారి ఆస్తుల్లా పెరిగిపోతున్నాయి: నారా లోకేశ్

  • పెరిగిన ఉల్లి ధరలపై నారా లోకేశ్ స్పందన
  • వరుస ట్వీట్లతో విమర్శలు
  • త్వరలోనే జగనన్న ఉల్లి వారోత్సవాలు జరపాలంటూ ఎద్దేవా

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పెరుగుతున్న ఉల్లి ధరలను  సీఎం జగన్ ఆస్తులతో పోల్చారు. ఉల్లి ధరలు జగన్ గారి ఆస్తుల్లా నానాటికీ పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. త్వరలోనే జగనన్న ఉల్లి వారోత్సవాలు నిర్వహించాల్సిన రోజులు దగ్గరపడ్డాయంటూ ట్వీట్ చేశారు. కూరగాయల ధరలు జెట్ స్పీడుతో దూసుకెళుతున్నాయని తెలిపారు. జగన్ గారి విధ్వంసక పాలన పుణ్యమాని అసలు పనులే లేవనుకుంటే ఇప్పుడు అప్పు చేసి పూట గడుపుకునే పరిస్థితి కూడా లేకుండాపోయిందని విమర్శించారు.

పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రూ.500 కూలీ కూడా వదులుకుని కేజీ ఉల్లిగడ్డల కోసం క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని పేర్కొన్నారు. ఓ ప్రణాళిక అంటూ లేకుండా సాగుతున్న జగన్ గారి పాలనతో మహిళలు పనులు కూడా మానుకుని గంటల తరబడి క్యూలలో నిలబడక తప్పడంలేదని ట్వీట్ చేశారు. గడ్డకట్టిన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామంటున్న జగన్ గారు ముందు ఉల్లిపాయలు డోర్ డెలివరీ చేస్తే బాగుంటుందని సూచించారు.

More Telugu News