budda venkanna: నోటికొచ్చినట్లు మాట్లాడుతోన్న మీ మంత్రులను కూడా అరెస్టు చేయండి: బుద్ధా వెంకన్న

  • జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు
  • మహిళలు జగన్ గారిని తిట్టుకుంటున్న మాట వాస్తవం
  • మీ మంత్రులు మాట్లాడే మాటలు తట్టుకోలేక పద్మజ విమర్శలు చేశారు 
  • పద్మజ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. 'నమ్మిన వ్యక్తి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది మహిళలు జగన్ గారిని తిట్టుకుంటున్న మాట వాస్తవం. 45 ఏళ్లకే బీసీ,ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్న జగన్ గారు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. అందులో భాగంగా కడుపు మండిన ఒక మహిళ మీ మంత్రులు మాట్లాడే మాటలు తట్టుకోలేక విమర్శలు చేస్తే అరెస్టులు చేస్తారా?' అని ఆయన ప్రశ్నించారు

పద్మజ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని బుద్ధా వెంకన్న అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వైకాపా మంత్రులు, నాయకులను కూడా అరెస్టులు చేస్తారా? అని ఆయన నిలదీశారు. కాగా, ఏపీ మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలానికి చెందిన పద్మజ అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆమెపై గొట్టెముక్కల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకొని కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.

More Telugu News