Narendra Modi: ఆయన ఆఫర్ కి నేను ఒప్పుకోలేదు... మోదీతో భేటీలో ఏం జరిగిందో చెప్పిన శరద్ పవార్!

  • గత నెలలో నరేంద్ర మోదీతో సమావేశం
  • కలిసి పనిచేద్దామన్న మోదీ
  • తిరస్కరించిన శరద్ పవార్

మహారాష్ట్రలో ఇటీవల రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సమయంలో బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో శరద్ పవార్ న్యూఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కూడా. శరద్ పవార్ బీజేపీతో కలుస్తారని, ఆయనకు రాష్ట్రపతి పదవిని ఆఫర్ చేశారని కూడా వార్తలు వచ్చాయి.

నాటి సమావేశంపై శరద్ పవార్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరమూ కలిసి పని చేద్దామని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని, అయితే, తాను దాన్ని తిరస్కరించానని పవార్ అన్నారు. "మనిద్దరి మధ్యా వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయి. కానీ, కలిసి పనిచేయడం జరిగే పని కాదు" అని స్పష్టం చేసినట్టు పవార్ తెలిపారు. తనకు రాష్ట్రపతి పదవిని ఆఫర్ చేసినట్టు వచ్చిన వార్తలు మాత్రం అవాస్తవమని అన్నారు.

తన కుమార్తె సుప్రియా సూలేను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకునే విషయం మాత్రం చర్చకు వచ్చిందన్నారు. మహారాష్ట్ర సంక్షోభ సమయంలో శరద్ పవార్ పై మోదీ ప్రశంసల వర్షం కురిపించడం, ఆ వెంటనే పవార్ హస్తినకు వెళ్లి చర్చలు జరపడంతో కొత్త పొత్తులు ఏర్పడనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. అయితే, చివరకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికలో ప్రభుత్వం ఏర్పడింది.

More Telugu News