Guntur District: మౌనిక అదృశ్యం కేసులో పురోగతి.. పాత స్నేహితుడితో వెళ్లిపోయినట్టు గుర్తింపు!

  • ఈ నెల 27న హాస్టల్ నుంచి అదృశ్యమైన మౌనిక
  • పాత స్నేహితుడు మణిరత్నంతో కలిసి వెళ్లిపోయినట్టు గుర్తింపు
  • గుంటూరులో ఫోన్ లొకేషన్

హైదరాబాద్, హిమాయత్‌నగర్ హాస్టల్ నుంచి ఈ నెల 27న అదృశ్యమైన మౌనిక కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ చివరిసారి నరేశ్ అనే తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది.

మౌనిక తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ట్యాంక్‌బండ్ వద్ద సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఆమె సికింద్రాబాద్ వైపు నడుచుకుంటూ వెళ్లినట్టు గుర్తించారు. చివరిసారి ఫోన్ చేసిన నరేశ్‌ను పిలిపించి మాట్లాడారు. అలాగే, అదృశ్యానికి ముందు రోజు తండ్రికి ఫోన్ చేసిన మౌనిక.. పాత స్నేహితుడైన మణిరత్నం వేధిస్తున్నాడని, అతడి వేధింపులు తట్టుకోలేకపోతున్నానని విలపించింది. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది.

ఈ కాల్ ఆధారంగా మణిరత్నం ఫోన్‌ను ట్రేస్ చేసిన పోలీసులు ఏపీలోని గుంటూరు నుంచి సిగ్నల్స్ వస్తున్నట్టు గుర్తించారు. దీంతో మౌనిక అతడితోనే వెళ్లిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరుకు ఓ బృందాన్ని పంపించారు.

More Telugu News