Tamilnadu: తమిళనాడులో ప్రియాంక తరహా ఘటన... ముళ్లపొదల్లో అమ్మాయి మృతదేహం!

  • అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన రోజా అనే యువతి  
  • సామూహిక అత్యాచారానికి గురై ఉంటుందని అనుమానం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

తెలంగాణలో జరిగిన ప్రియాంక రెడ్డి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై అందరూ భగ్గుమంటుండగానే, అటు తమిళనాడులో సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కాంచీపురంలో రోజా అనే యువతి హత్యకు గురైంది. వారం కిందట అదృశ్యమైన రోజా ముళ్లపొదల్లో శవమై కనిపించింది. ప్రియాంక రెడ్డి తరహాలోనే ఆమె కూడా దహనమైన స్థితిలో పడివుంది.

ఆండిసిరువళ్లూరు ప్రాంతానికి చెందిన రోజా (20) శ్రీపెరంబుదూరులో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. గత శనివారం ఉద్యోగ విధుల నిమిత్తం బయటికి వెళ్లిన రోజా మళ్లీ తిరిగిరాలేదు. చివరిసారిగా ఆమె సహోద్యోగి రాజేశ్ తో మాట్లాడినట్టు గుర్తించారు. కాగా, సిరువాక్కం సమీపంలో రోజా మృతదేహం ఓ ముళ్లచెట్టుకు వేళ్లాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించిన కుటుంబ సభ్యులు అది రోజానే అని తెలుసుకుని తీవ్ర విషాదానికి లోనయ్యారు.

కాగా, రోజా మృతదేహం పడివున్న ప్రాంతం ఓ పొలిటికల్ లీడర్ దని పోలీసులంటున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రోజాపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రోజా చివరిసారిగా మాట్లాడిన రాజేశ్ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.

More Telugu News