lotttery: లాటరీ రూపంలో వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం!

  • ఒకే రోజు రెండు టిక్కెట్లకు డబ్బు
  • స్నేహితుడు కొనిపారేసిన టిక్కెట్టుకు రూ.8.5 లక్షలు
  • తను కొన్న టిక్కెట్టుకు మరో రూ.11.4 లక్షలు

అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే. ఒకే రోజు రెండు లాటరీల్లో నగదు బహుమతి రావడంతో ఇరవై నాలుగు గంటల్లో ఆమె లక్షాధికారిగా మారిపోయింది. పైగా తను కొన్న టిక్కెట్టుకే కాదు స్నేహితుడు కొని పారేసిన టిక్కెట్టును తీసి భద్రపరచడం కూడా ఆమెకు కలిసివచ్చింది.


వివరాల్లోకి వెళితే... ఆమెరికాలోని వర్జీనియా రాష్ట్రం మెకానిక్స్ విల్లే ప్రాంతానికి చెందిన ఓ యువతి తన బిజినెస్ పార్టనర్ తో కలిసి మార్కెట్ కు వెళ్లింది. ఓ లాటరీ షాప్ కు వెళ్లి టిక్కెట్టు కొనుగోలు చేసింది. తన పార్టనర్ తోనూ ఒక టిక్కెట్టు కొనిపించింది. అయాచిత ఆదాయంపై నమ్మకంలేని పార్టనర్ ఆమె మాట కాదనలేక టిక్కెట్టు కొన్నా వెంటనే దాన్ని అక్కడే విసిరిపారేశాడు.

అయితే సదరు యువతి తను కొన్న టిక్కెట్టుతోపాటు స్నేహితుడి టిక్కెట్టును కూడా సేకరించి జాగ్రత్త పరిచింది. ఆ రెండు టిక్కెట్లకు జాక్ పాట్ తగలడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ముందుగా స్నేహితుడు పారేసిన టిక్కెట్టుకి రూ.8 లక్షల 54 వేలు (12 వేల డాలర్లు) బహుమతి వచ్చినట్టు తెలియడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయిపోయింది.

అనూహ్యంగా తను కొన్న టిక్కెట్టుకు మరో రూ.11 లక్షల 40 వేలు వచ్చాయని సాయంత్రం తెలియడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఒకే రోజు దాదాపు రూ.20 లక్షలు బహుమతిగా రావడంతో గంటల వ్యవధిలో ఆమె లక్షాధికారిగా మారిపోయింది. కాగా, ఉదయం వచ్చిన డబ్బును స్నేహితుడితో పంచుకుంటానని, సాయంత్రం వచ్చిన డబ్బు స్నేహితురాలి కుమార్తె పెళ్లికోసం ఖర్చుచేస్తానని జాక్ పాట్ సాధించిన యువతి తెలిపింది.

More Telugu News