Pakistan: పాకిస్థాన్ చెరలో విశాఖ వాసి ప్రశాంత్.. అక్రమంగా ప్రవేశించాడంటున్న పాక్!

  • ఈ నెల 14న అదుపులోకి తీసుకున్న పాక్
  • అక్కడి మీడియాలో వీరిపై అనుమానపు కథనాలు
  • ఇప్పటి వరకు స్పందించని భారత విదేశాంగ శాఖ

తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ ఇద్దరు భారతీయులను పాకిస్థాన్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్ కాగా, మరొకరు విశాఖపట్టణానికి చెందిన ప్రశాంత్ వైందంగా గుర్తించారు. పాస్‌పోర్టు, వీసా లేకుండా వీరు తమ దేశంలోకి ప్రవేశించినట్టు పాక్ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 14న వీరిని బహావుల్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరిద్దరిపైన అక్కడి చట్టంలోని 334-4 కింద అభియోగాలు నమోదయ్యాయి.

రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతంలో వీచే బలమైన గాలుల వల్ల భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉన్న కంచె కొన్నిసార్లు కనిపించదని, దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు పొరపాటు పడి సరిహద్దు దాటుతుంటారని భారత అధికారులు తెలిపారు. తాజా ఘటనలోనూ అదే జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

మరోవైపు, అక్కడి మీడియా మాత్రం వీరిపై అనుమానపు కథనాలు రాసింది. పాక్ అదుపులో ఉన్న ఇద్దరిలో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని, అధునాతన ఉగ్రదాడి చేసేందుకు వీరిని పంపించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాసుకొచ్చింది. ఆగస్టులో రాజు లక్ష్మణ్ అనే భారత గూఢచారిని పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో అరెస్ట్ చేసినట్టు ఈ సందర్భంగా పేర్కొంది. కాగా, ఈ వ్యవహారంపై భారత విదేశీ వ్యవహారాల  శాఖ ఇప్పటి వరకు స్పందించలేదు.

More Telugu News