Lakshmi Parvathi: ఈ మనవడే ఎంత దారుణమైన నింద వేశాడో చూశారా?: లోకేశ్ పై లక్ష్మీపార్వతి విమర్శలు

  • మీడియా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన లక్ష్మీపార్వతి
  • చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు
  • మనవడు లేడు, అల్లుడు లేడంటూ ఆగ్రహం

ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భార్యగా ఇతర కుటుంబ సభ్యులు తనను ఎంతో మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఒక్క పదవి కూడా రాకుండా చేశారని మండిపడ్డారు. ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీ నేడు దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందని అన్నారు. ఇప్పుడు పార్టీలోకి కొత్తగా కుక్కమూతి పిందెలు వచ్చాయంటూ పరోక్షంగా లోకేశ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ కుక్కమూతి పిందెకు ఏం తెలుసని పార్టీ లీడర్ గా చేశారని విమర్శించారు.

లోకేశ్ వంటి అయోగ్యుడ్ని పార్టీపై చంద్రబాబు బలవంతంగా రుద్దారని ఆరోపించారు. ఎన్టీఆర్ వంటి మహోన్నత వ్యక్తి స్థాపించిన పార్టీకి లోకేశ్ నాయకుడా? అంటూ నిప్పులు కురిపించారు. ఈ విషయమై టీడీపీలో ఎంత మంది లోలోపల బాధపడుతున్నారో తమకు తెలుసని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఈ దశలో, మీ మనవడిపై కొంచెం కూడ ప్రేమ లేదా అని యాంకర్ ప్రశ్నించగా, వాళ్లకు ఉందా నామీద ప్రేమ అంటూ లక్ష్మీపార్వతి తిరిగి ప్రశ్నించారు.

ఎన్నికల ముందు ఈ మనవడే తనపై దారుణమైన నిందను వేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. "నా వయసును కూడా చూడకుండా 60 ఏళ్లు దాటినదాన్ని కూడా ఇంత భయంకరమైన నింద వేసి అప్రదిష్ట పాల్జేయాలని చూస్తారా? 30 ఏళ్లప్పుడు లేనిది 60 ఏళ్ల వయసులో ఇంత దారుణమైనది సృష్టించారు. ఇంత నీచానికి పాల్పడినవాళ్లు నా బంధువులని ఎలా చెప్పుకుంటాను. నాకొద్దు వాళ్లతో బంధుత్వం! మనవడు లేడు, అల్లుడు లేడు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News