Chiranjeevi: ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయం చెప్పిన చిరంజీవి!

  • హైదరాబాద్ లో అక్కినేని అవార్డుల కార్యక్రమం
  • హాజరైన చిరంజీవి
  • సభికులను విస్మయానికి గురిచేసిన మెగాస్టార్

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ జాతీయ అవార్డుల కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు బయటి వ్యక్తులకు తెలియని ఓ విషయాన్ని సభాముఖంగా వెల్లడించారు. ఆయన చెప్పిన విధానం ఏ దర్శకుడికి తీసిపోని విధంగా ఉండడంతో సభికులు కూడా ఎంతో ఆసక్తిగా విని చివర్లో అత్యంత విస్మయానికి లోనయ్యారు. ఇంతకీ ఆయనేం చెప్పారంటే... ఓ కొత్త జంట పల్లెటూరు నుంచి పక్కనే ఉన్న టౌన్ కు సినిమా చూసేందుకు బయల్దేరారంటూ మొదలుపెట్టారు.

"ఆ సమయంలో భార్య గర్భవతిగా ఉంది. నెలలు నిండాయి. కానీ తన అభిమాన హీరో సినిమా రిలీజైంది. దాంతో ఆ సినిమా చూడాలన్న కోరికను తన భర్తతో చెప్పింది. పక్కనే ఉన్న టౌన్ కు వెళ్లాలంటే ఆరు కిలోమీటర్లు ప్రయాణించాలి. ఓ నిండు గర్భవతికి అది చాలా ప్రమాదంతో కూడిన ప్రయాణం. అయినా భార్య కోరిక కాదనలేక ఆ భర్త ఓ జట్కా బండి ఏర్పాటు చేశాడు. అయితే మార్గమధ్యంలో వారు ఎక్కిన గుర్రపుబండి ప్రమాదానికి గురై పక్కకి పడిపోయింది. భార్య కూడా కిందపడిపోవడంతో భర్త తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

వెనక్కివెళ్లిపోదామని ఆ భర్త చెప్పినా భార్య వినిపించుకోకుండా సినిమాకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టింది. దాంతో అలాగే ముందుకెళ్లి సినిమా చూసి వచ్చారు. ఆనాడు గర్భంతో ఉన్న ఆవిడ ఎవరో కాదు మా అమ్మ అంజనాదేవి.భార్య కోరిక తీర్చిన ఆ వ్యక్తి మా నాన్న వెంకట్రావు. మా అమ్మ చూడాలనుకున్న సినిమా 'రోజులు మారాయి'. కథానాయకుడు ఎవరో కాదు ఈ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారే. ఇంతకీ ఆమె కడుపులో ఉన్నది ఎవరో కాదు నేనే" అంటూ సభికులను ఆశ్చర్యంలో ముంచెత్తారు.

More Telugu News