Vijay Sai Reddy: వంశీ వదిలిన సవాళ్లకు సమాధానం చెప్పండి.. ఎల్లో మీడియా కూడా షాక్ నుంచి తేరుకోనట్టుంది: విజయసాయి రెడ్డి

  • టీడీపీపై విజయసాయి రెడ్డి విమర్శలు
  • టీడీపీ మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైంది
  • చివరకు తండ్రీకొడుకు, తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే మిగులుతారు

టీడీపీని వీడి వైసీపీలో చేరిన అనంతరం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విమర్శల జల్లు కురిపిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ముందు వంశీ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన సవాలు విసిరారు. టీడీపీ మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైందని విమర్శించారు.

'వల్లభనేని వంశీ వదిలిన సవాళ్లకు తెలుగుదేశం పార్టీ జవాబిచ్చే పరిస్థితిలో ఉందా? మాలోకం ఏదో అన్నాడు కాని ఎవరూ పట్టించుకోలేదు. మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైంది. చివరకు తండ్రీకొడుకు, తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే మిగులుతారు. ఎల్లో మీడియా కూడా షాక్ నుంచి తేరుకోనట్టుంది' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

''బంగారు బాతు' అమరావతిని చంపేశారని చంద్రబాబు గారు శోకాలు పెడుతున్నదెందుకో ఇప్పుడర్థమైంది. అమరావతిలో తాత్కాలిక భవనాల కాంట్రాక్టు పొందిన సంస్థ రూ.500 కోట్లు ముట్ట చెప్పిందని ఇన్‌కంటాక్స్ వాళ్లు బయట పెట్టిన తర్వాత లింకులు, బొంకులన్నీ ఒక్కటొకటిగా వెలుగు చూస్తున్నాయి' అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

More Telugu News