Sriya: హీరోయిన్ శ్రియను రియాల్టీ షోకు న్యాయ నిర్ణేతగా తీసుకొస్తానని చెప్పి మోసగించిన విలేకరి... కేసు నమోదు చేసిన పోలీసులు!

  • రియాల్టీ షో ప్లాన్ చేసిన చంద్రాయుడు
  • శ్రియను ఒప్పిస్తానని హామీ ఇచ్చిన సింధూజ
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఓ టీవీ చానల్ నిర్వహిస్తున్న రియాల్టీ షోకు న్యాయ నిర్ణేతగా హీరోయిన్ శ్రియను తీసుకువస్తానని నమ్మబలికిన ఓ విలేకరి రూ. 5 లక్షలు వసూలు చేశాడు. ఈ ఘటనకు శ్రియ మేనేజర్ లక్ష్మీ సింధూజ కూడా సహకరించడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 5లో నివాసం ఉండే చంద్రాయుడు, ఓ చానల్ లో రియాల్టీ షోను నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నాడు. దీనికి న్యాయ నిర్ణేతగా శ్రియను పిలిపించాలని భావించాడు. ఈ క్రమంలో చంద్రాయుడికి పరిచయమైన ఓ న్యూస్ పేపర్ విలేకరి, శ్రియకు మేనేజర్ గా పనిచేసే లక్ష్మీ సింధూజ తనకు పరిచయమని చెప్పాడు. ఆపై ఆమెను పిలిపించి, ఓ హోటల్ లో చర్చలు సాగించారు. శ్రియను ఒప్పిస్తానని సింధూజ చెప్పడంతో ఆమె ఖాతాలో రూ. 5 లక్షలు జమ చేశాడు. ఆపై నెల రోజులు గడిచినా, శ్రియ రాకపోవడం, సింధూజ, సదరు రిపోర్టర్ అందుబాటులో లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారు ఎక్కడున్నారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News