cm: కొత్త చట్టం తీసుకొచ్చి జడ్జిల పైనా తప్పుడు కేసులు పెడతారేమో!: జగన్ పై లోకేశ్ విమర్శలు

  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే కఠిన చర్యలా!
  • ఆ జీవో రద్దు చేయాలని స్పష్టంగా చెబుతున్నాం
  • ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మీడియాపై దొంగ కేసులు పెడతారా?

నెల్లూరులో ఆత్మహత్యకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే నిమిత్తం ఇవాళ నారా లోకేశ్ అక్కడికి వెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా వార్తలు రాసే మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సర్కార్ ఇటీవల జారీ చేసిన జీవో విషయమై లోకేశ్ ను స్పందించాలని ఓ విలేకరి కోరారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ జీవోను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసిందని అన్నారు. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. తమ ప్రజాప్రతినిధులపై, కార్యకర్తలపై, మీడియా పైనా దొంగ కేసులు పెట్టారని, రేపు కొత్త చట్టం తీసుకొచ్చి జడ్జిల పైనా తప్పుడు కేసులు పెట్డండని సీఎం జగన్ చెప్పే పరిస్థితికి వచ్చారని తీవ్ర విమర్శలు చేశారు.

అందుకే, మనందరం పోరాడాలని పిలుపు నిచ్చారు. ఇలాంటి అంశాలపై యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా బయటకొచ్చి పోరాడాలని లేకపోతే చాలా ఇబ్బంది పడతామని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని నిప్పులు చెరిగారు.

More Telugu News