ANR Awards: శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్ పురస్కారాలను ప్రకటించిన నాగార్జున!

  • ఈ నెల 17న ఏఎన్నార్ అవార్డుల ప్రదానం
  • 2018. 2019 సంవత్సరాలకు అవార్డులు 
  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న చిరంజీవి

ఏఎన్నార్ పురస్కారాలను అక్కినేని ఇంటర్నేషన్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2018, 2019 సంవత్సరాలకు గాను ఏఎన్నార్ పురస్కారాలను అక్కినేని నాగార్జున ప్రకటించారు. సినీ నిర్మాత, రాజకీయవేత్త సుబ్బరామిరెడ్డితో కలసి ఈరోజు మీడియా సమావేశంలో పురస్కార విజేతల పేర్లను ఆయన ప్రకటించారు.

ఇక 2018వ సంవత్సరానికిగాను దివంగత శ్రీదేవికి, 2019 ఏడాదికిగాను సీనియర్ నటి రేఖకు అవార్డులను అనౌన్స్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈనెల 17న నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను అందించనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

మరోవైపు అదే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ లో 'అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా' మూడవ స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రేఖ చీఫ్ గెస్ట్ గా హాజరవుతారు.

More Telugu News