Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా నీలం సాహ్ని నియామకం.. నేడే బాధ్యతల స్వీకరణ!

  • నవ్యాంధ్రకు తొలి మహిళా ప్రధాన కార్యదర్శి
  • 1984 ఐఏఎస్ బ్యాచ్ అధికారిణి
  • గతంలో పలు విభాగాల్లో విధులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎస్ గా ఆమెను నియమిస్తూ బుధవారం రాత్రి జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె, నవ్యాంధ్రకు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటి వరకూ ఆమె కేంద్ర సామాజిక న్యాయ, ఎంపవర్ మెంట్ కార్యదర్శిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశ్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదే సమయంలో తాత్కాలిక సీఎస్ గా ఉన్న నీరబ్ కుమార్ ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

1984వ ఐఏఎస్ బ్యాచ్ అధికారిణి అయిన నీలం సాహ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు విభాగాల్లో విధులను నిర్వర్తించారు. మచిలీపట్నం ,టెక్కలిలో అసిస్టెంట్ కలెక్టర్ గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా పనిచేశారు. మున్సిపల్ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేశారు. ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గానూ సేవలందించారు.

More Telugu News