కోర్టు ఆదేశాలు, కమిటీ నిర్ణయం మాకు అంగీకారమే: అశ్వత్థామరెడ్డి
- ప్రభుత్వం ఇప్పటికైనా కోర్టు సూచనలు పాటించాలన్న అశ్వత్థామరెడ్డి
- భేషజాలకు పోకుండా కమిటీ ఏర్పాటుకు సమ్మతించాలని విజ్ఞప్తి
- ప్రభుత్వం కమిటీ వేస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి
‘హైకోర్టు ఈరోజు వాదనల తర్వాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని సూచించింది. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి రేపు మధ్యాహ్నంలోగా కమిటీ ఏర్పాటుపై వివరాలను వెల్లడిస్తామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలపడం బాగానే ఉంది. మేం కూడా సీఎంను అదే కోరుతున్నాం. కమిటీ వేసి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలి. భేషజాలకు పోకుండా కమిటీ ఏర్పాటుకు అంగీకరించి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నాం. కోర్టు ఆదేశాలు, కమిటీ నిర్ణయం మాకు అంగీకారమే. కమిటీకి కాలపరిమితి ఉంటుందని అనుకుంటున్నాం. ప్రభుత్వం కమిటీ వేస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నాం. సమ్మె చట్ట విరుద్ధమని చెప్పడానికి వీల్లేదని కోర్టు తెలిపింది’ అని అశ్వత్థామరెడ్డి వివరించారు.