Honda: మనేసర్ ప్లాంట్ ను నిరవధికంగా మూసివేసిన హోండా!

  • 6 వేల నుంచి 3,500 యూనిట్లకు తగ్గిన తయారీ
  • ఉద్యోగాన్ని కోల్పోయిన 1000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు
  • సమ్మెకు దిగిన ఉద్యోగ సంఘాలు

హర్యానాలోని మనేసర్ లో ఉన్న తమ ద్విచక్ర వాహనాల తయారీ ప్లాంటును నిరవధికంగా మూసివేస్తున్నట్టు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వెల్లడించింది. ఈ ప్లాంటు కార్మికులు గత కొంతకాలంగా సమ్మె చేస్తుండగా, సాధారణ కార్యకలాపాలన్నీ నిలిపివేశామని సంస్థ ప్రకటించింది.

యూనియన్ నేతలు, ప్లాంట్ మేనేజ్ మెంట్ మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదని ఈ సందర్భంగా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. యూనియన్ నేతలు, శాశ్వత ఉద్యోగులు కలిసి కాంట్రాక్ట్ కార్మికులను రెచ్చగొడుతున్నారని, కంపెనీ ప్రాంగణంలోనే వీరంతా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దిగారని హోండా ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో బైక్ ల తయారీ సాధ్యం కాదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని, తిరిగి సాధారణ పరిస్థితి నెలకొన్న తరువాత, పనులు ప్రారంభమవుతాయని వెల్లడించింది.

కాగా, బైక్ ల తయారీలో కోత విధించిన తరువాత, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 5 నుంచి హోండా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి పొలిటికల్ పార్టీలు, మిగతా ప్లాంట్ల యూనియన్లు మద్దతిస్తున్నాయి. ఇక్కడ రోజుకు తయారయ్యే బైక్ ల సంఖ్య 6 వేల నుంచి 3,500కు తగ్గడంతో దాదాపు 1000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఇదే సమయంలో నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకూ సవరించాల్సిన పేస్కేల్ ను కూడా యాజమాన్యం సవరించలేదని కార్మికులు ఆరోపిస్తూ సమ్మెకు దిగారు.

More Telugu News