హైదరాబాద్ లో విషాదం... ఫంక్షన్ హాల్ గోడకూలి నలుగురి దుర్మరణం

  • అంబర్ పేటలో కుప్పకూలిన ఫంక్షన్ హాల్ గోడ
  • మృతుల్లో ఒకరు మహిళ
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్ హాల్ గోడకూలిపోయిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. అంబర్ పేట్ గోల్నాకలో ఉన్న పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఈ ఘోరం జరిగింది. లోపల ఓ వివాహం జరుగుతున్న సమయంలో గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కృష్ణయ్య, సొహెయిల్, సురేశ్, విజయలక్ష్మి మరణించగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మృతుల కుటుంబాలకు జీహెచ్ఎంసీ రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

కాగా, ఈ ఘటనలో పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఇటీవలే పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ కు మరమ్మతులు నిర్వహించగా, ఇవాళే పునఃప్రారంభమైంది. అంతలోనే ప్రమాదం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు.
Go Back to Shorts
Hyderabad
Amberpet
Golnaka
Pearl Garden
Function Hall
Kishan Reddy
Telangana

More Telugu News