Ayodhya: అయోధ్య తీర్పును ఒకరి గెలుపు, మరొకరి ఓటమిగా చూడకూడదు: మోదీ స్పందన

  • భారత భక్తి భావాన్ని బలోపేతం చేసిన సమయమిది
  • ప్రజలందరూ శాంతి, సద్భావన, ఐకమత్యంతో నిలవాలి 
  • దశాబ్దాలుగా కొనసాగుతోన్న వివాదానికి సామరస్య ముగింపు

అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించిన నేపథ్యంలో దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ తీర్పును ఒకరి గెలుపు, మరొకరి ఓటమిగా చూడకూడదని సూచించారు. 'ఇది రామభక్తి, రహీం భక్తికాదు... భారత భక్తి భావాన్ని బలోపేతం చేసిన సమయమిది. ప్రజలందరూ శాంతి, సద్భావన, ఐకమత్యంతో నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చట్టాలను లోబడి ఎలాంటి వివాదాన్నైనా పరిష్కరించుకోవచ్చు. అందుకు ఉదాహరణ అయోధ్య భూ వివాద పరిష్కారమే' అని ట్వీట్లు చేశారు.

భారత న్యాయవ్యవస్థ స్వతంత్రత, పారదర్శకత, దూరదృష్టిని తీర్పు చాటిచెబుతోందని మోదీ అన్నారు. 'చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పడానికి ఈ తీర్పు నిదర్శనం. 130 కోట్ల మంది పాటిస్తోన్న శాంతి, సంయమనం, విలువలకు ఇది ప్రతీక. ఈ ఐక్యతా భావం దేశాభివృద్ధి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతోన్న వివాదానికి సామరస్య ముగింపు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలను తెలిపేందుకు సరిపడా సమయం దొరికింది. ఈ తీర్పు భారత న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచుతోంది' అని చెప్పారు. 

More Telugu News