Devineni Uma: చౌకబారు ఆరోపణలు చేస్తే ఇంటికొచ్చి చొక్కాపట్టుకుంటా!: దేవినేని ఉమకు వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వార్నింగ్

  • ఎమ్మెల్యే అండతోనే ఇసుక అక్రమ రవాణా అన్న దేవినేని
  • అక్రమ రవాణాతో తనకు సంబంధం లేదన్న ఎమ్మెల్యే
  • ఉనికి కోసమే అసత్య ఆరోపణలన్న వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక సమస్యపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య నెలకొన్న రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. ఇసుకపై వైసీపీ, టీడీపీ నేతల విమర్శలు శ్రుతిమించుతున్నాయి. కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య మాటల యుద్ధం మరింత ముదిరి పరస్పర హెచ్చరికల వరకు వెళ్లింది.

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అండతోనే  ఇసుక అక్రమంగా తరలిపోతోందని మండిపడ్డారు. దేవినేని ఆరోపణలపై ఎమ్మెల్యే మండిపడ్డారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

బురదలో పొర్లాడే పంది, దేవినేని ఇద్దరూ ఒకటేనని అన్నారు. ఆయనో వెధవ అని, తన ఉనికి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే ఉమామహేశ్వరరావు ఇంటికెళ్లి ఆయన చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తానని హెచ్చరించారు.

More Telugu News