bsnl: బీఎస్ఎన్ఎల్‌లో వీఆర్ఎస్.. 80 వేల మంది ఉపయోగించుకునే అవకాశం

  • 80 వేల మంది వరకు వీఆర్ఎస్‌ను ఉపయోగించుకునే అవకాశం
  • రూ.7 వేల కోట్ల మేర తగ్గనున్న జీతభత్యాల భారం
  • వచ్చే నెల 3 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌ కష్టాల నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టే ఉన్నాయి. ఆ సంస్థ ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)ను 70 నుంచి 80 వేల మంది ఉపయోగించుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అదే జరిగితే దాదాపు 7 వేల కోట్ల రూపాయల మేర జీతభత్యాల వ్యయం తగ్గుతుందని సంస్థ భావిస్తోంది. ఈ నెల 4 నుంచే వీఆర్ఎస్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, వచ్చే నెల 3 వరకు చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ తెలిపారు.

50 ఏళ్లు పైబడిన శాశ్వత ఉద్యోగులు మాత్రమే వీఆర్ఎస్‌కు అర్హులని పుర్వార్ పేర్కొన్నారు. ఇప్పటికే  పూర్తిచేసుకున్న సర్వీసుకు గాను ఏడాదికి 35 రోజుల చొప్పున, మిగిలి ఉన్న సర్వీసుకు ఏడాదికి 25 రోజుల చొప్పున వేతనాన్ని ఎక్స్‌గ్రేషియాగా అందించనున్నట్టు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఎంటీఎన్ఎల్‌లోనూ వీఆర్ఎస్ అమలు చేస్తున్నారు.

More Telugu News