APJ Abdul Kalam Prathibha Puraskar: ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై జగన్ సీరియస్.. జీవో రద్దుకు ఆదేశాలు!

  • తనను సంప్రదించకుండానే పేరు మార్చడంపై ఆగ్రహం
  • జీవోను తక్షణమే రద్దు చేయాలంటూ ఆదేశం
  • అబ్దుల్ కలాం పేరును కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ఏపీలో ఇస్తున్న 'డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్' అవార్డుల పేరును 'వైయస్సార్ విద్యా పురస్కారాలు'గా ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. తనను సంప్రదించకుండానే పేరు మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరునే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, జగ్జీవన్ రాం, పూలే పేర్లతో కూడా అవార్డులు ఇవ్వాలని ఆదేశించారు.

More Telugu News