Purandeswari: జగన్ నిర్ణయాలతో పెట్టుబడులు వచ్చే అవకాశమే లేదు: పురందేశ్వరి

  • ఇసుక కొరతకు వరదలే కారణమని సాకులు చెబుతున్నారు
  • ముందస్తుగా ఇసుకను ఎందుకు నిలువ చేయలేదు
  • ప్రభుత్వ వైఖరితో అభివృద్ధి కుంటుపడుతోంది

వరదల వల్లే ఇసుక కొరత ఏర్పడిందంటూ వైసీపీ నేతలు చెప్పడాన్ని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి తప్పుపట్టారు. ఇసుక సమస్యను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వరదలే కారణం అని సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వరదలు వచ్చి రెండు నెలలే అవుతోందని... కానీ, వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తోందని ఎద్దేవా  చేశారు. ఇసుకను ముందస్తుగా ఎందుకు నిలువ చేయలేకపోయారని ప్రశ్నించారు.

పాత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఐదు నెలలైనా... కొత్త విధానాన్ని తీసుకురాలేకపోయారని పురందేశ్వరి విమర్శించారు. రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు, ఇసుక సమస్యల కారణంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు.

More Telugu News